YouVersion Logo
Search Icon

లూకా 19

19
పన్ను వసూలు చేసే జక్కయ్య
1యేసు యెరికో పట్టణంలోనికి ప్రవేశించి దానిగుండా వెళ్తున్నారు. 2అక్కడ జక్కయ్య అనే పేరుగలవాడు ఉన్నాడు, అతడు ప్రధాన పన్ను వసూలుదారుడు మరియు ధనవంతుడు. 3అతడు యేసు ఎవరో చూడాలని ఆశించాడు, కాని అతడు పొట్టివాడు గనుక జనసమూహం మధ్యలో ఉన్న యేసును చూడలేకపోయాడు. 4కనుక యేసు ఆ దారిలోనే వస్తున్నాడు, కనుక అతడు పరుగెత్తి యేసును చూడాలని మేడి చెట్టు ఎక్కాడు.
5యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, ఆయన పైకి చూసి అతనితో, “జక్కయ్యా, వెంటనే క్రిందికి దిగు. నేను ఈ రోజు నీ ఇంట్లో ఉండాలి” అన్నారు. 6అతడు వెంటనే క్రిందకు దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకొని వెళ్లాడు.
7ప్రజలందరు అది చూసి, “ఈయన ఒక పాపాత్ముని ఇంటికి అతిథిగా వెళ్లాడు” అని సణగడం మొదలుపెట్టారు.
8కానీ జక్కయ్య నిలబడి ప్రభువుతో, “చూడు, ప్రభువా! నా ఆస్తిలో సగం బీదలకిస్తున్నాను, నేనెవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకొని ఉంటే, వారికి నాలుగంతలు నేను చెల్లిస్తాను” అని చెప్పాడు.
9అందుకు యేసు అతనితో, “ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే, కనుక నేడు రక్షణ ఈ ఇంటికి వచ్చింది. 10ఎందుకంటే తప్పిపోయిన దానిని వెదకి రక్షించడానికే మనుష్యకుమారుడు వచ్చాడు” అని చెప్పారు.
పది వెండి నాణెముల ఉపమానం
11వారు ఈ మాటలు వింటూ ఉండగా, యేసు తాను యెరూషలేముకు దగ్గరగా ఉన్నందుకు, ప్రజలు దేవుని రాజ్యం అకస్మాత్తుగా వచ్చేస్తుందని భావిస్తున్నందుకు, ఆయన వారికి ఒక ఉపమానం చెప్పారు 12“గొప్ప జన్మించిన వ్యక్తి సుదూర దేశానికి వెళ్లి తనను తాను రాజుగా నియమించుకొని తిరిగి వచ్చేయాలి. 13అందుకతడు తన పదిమంది సేవకులను పిలిచి వారికి పది మినాలను#19:13 మినాలను మినా అనగా సుమారు మూడు నెలల జీతం ఇచ్చి, ‘నేను తిరిగి వచ్చేవరకు, వీటితో వ్యాపారం చేయండి’ అని వారితో చెప్పాడు.
14“కాని ఆ పట్టణస్థులు అతన్ని ద్వేషించారు గనుక, ‘ఇతడు మాకు రాజుగా వద్దు’ అనే సందేశాన్ని అతనికి పంపించారు.
15“ఎలాగైతేనేం, అతడు రాజ్యాన్ని స్వాధీనపరచుకొని తిరిగి ఇంటికి వచ్చాడు. తరువాత అతడు తాను డబ్బు ఇచ్చిన సేవకులు దానితో ఏమి లాభం పొందారో తెలుసుకోవడానికి వారిని పిలిపించాడు.
16“మొదటి వాడు వచ్చి, ‘అయ్యా, నీవు ఇచ్చిన ఒక్క మినాతో పది మినాలను సంపాదించాను’ అని చెప్పాడు.
17“ఆ యజమాని, ‘భళా, మంచి దాసుడా! నీవు, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, గనుక పది పట్టణాల మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను’ అని వానితో చెప్పాడు.
18“తర్వాత రెండవవాడు వచ్చి, ‘అయ్యా, నీవు ఇచ్చిన ఒక్క మినాతో ఐదు మినాలు సంపాదించాను’ అని చెప్పాడు.
19“ఆ యజమాని వానితో, ‘నిన్ను ఐదు పట్టణాల మీద అధికారిగా నియమిస్తున్నాను’ అన్నాడు.
20-21“అప్పుడు మరొకడు వచ్చి, ‘అయ్యా, నీవు పెట్టని చోట తీసుకొనే, విత్తని చోట పంటను కోసే కఠినుడవని భయపడి, ఇదిగో నీవు ఇచ్చిన ఈ మినాను రుమాలులో దాచి పెట్టాను’ అన్నాడు.
22“అందుకు ఆ యజమాని, ‘చెడ్డ దాసుడా, నీ నోటి మాటతోనే నీకు తీర్పు తీరుస్తాను! నేను పెట్టని చోట తీసుకొనేవాడినని, విత్తని చోట పంటను కోసేవాడినని, కఠినుడనని నీకు తెలుసు, అవునా? 23అలాంటప్పుడు నీవు నా సొమ్మును, నేను తిరిగి వచ్చిన తర్వాత, వడ్డీతో సహా తీసుకొనేలా, వడ్డీ వ్యాపారుల దగ్గర ఎందుకు పెట్టలేదు?’ అన్నాడు.
24“ఆ తర్వాత ఆ యజమాని తన దగ్గర నిలిచిన వారితో, ‘వీని నుండి ఆ మినా తీసుకొని ఇప్పటికే పది మినాలు గలవానికి ఇవ్వండి’ అని చెప్పాడు.
25“అయితే వారు ‘అయ్యా, అతని దగ్గర ఇప్పటికే పది మినాలు ఉన్నాయి!’ అన్నారు.
26“అందుకు ఆ యజమాని, ‘కలిగిన ప్రతివానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, లేనివాని నుండి, వానికి కలిగివున్నది కూడా తీసివేయబడుతుంది అని మీతో చెప్తున్నాను’ అన్నాడు. 27అతడు ఇంకా ఏమి చెప్పాడంటే, ‘అయితే నేను పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తెచ్చి నా ముందు వారిని సంహరించండి’ అన్నాడు.”
యేసు రాజుగా యెరూషలేముకు వచ్చుట
28యేసు ఈ మాటలను చెప్పి యెరూషలేమునకు ప్రయాణమై వెళ్లారు. 29ఆయన ఒలీవల కొండ దగ్గరున్న బెత్పగే, బేతనియ గ్రామాల సమీపంలో ఉన్నప్పుడు, ఆయన తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ, 30“మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్లండి, దానిలో మీరు ప్రవేశించగానే, ఇంతవరకు ఎవ్వరూ ఎక్కని ఒక గాడిదపిల్ల కట్టబడి మీకు కనబడుతుంది. దానిని విప్పి ఇక్కడికి తీసుకురండి. 31‘మీరు ఎందుకు దాన్ని విప్పుతున్నారు?’ అని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ‘ఇది ప్రభువుకు కావాలి’ అని చెప్పండి” అని చెప్పి వారిని పంపారు.
32ఆయన పంపినవారు వెళ్లి, వారితో చెప్పినట్లే దానిని చూసారు 33వారు ఆ గాడిద పిల్లను విప్పుతుంటే, దాని యజమానులు, “మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు.
34అందుకు వారు, “ఇది ప్రభువుకు కావాలి” అని చెప్పారు.
35వారు దానిని యేసు దగ్గరకు తీసుకొనివచ్చి, ఆ గాడిదపిల్ల మీద తమ వస్త్రాలను వేశారు, యేసు దానిపై కూర్చున్నారు. 36ఆయన వెళ్తుంటే, ప్రజలు దారి పొడుగున తమ బట్టలను పరిచారు.
37ఒలీవల కొండ నుండి దిగే చోటికి ఆయన సమీపించినప్పుడు, శిష్యుల సమూహమంతా వారు చూసిన అద్బుతాలన్నింటిని బట్టి తమ స్వరాలతో బిగ్గరగా సంతోషంతో:
38“ప్రభువు పేరట వచ్చే రాజు స్తుతింపబడునుగాక!”#19:38 కీర్తన 118:26
“ఉన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ పరలోకంలో సమాధానం కలుగును గాక!”
అని దేవుని స్తుతించారు.
39ఆ జనసమూహంలో ఉన్న పరిసయ్యులు కొందరు యేసుతో, “బోధకుడా, నీ శిష్యులను గద్దించు!” అన్నారు.
40ఆయన వారితో, “నేను చెప్తున్నాను, వీరు ఊరుకుంటే ఈ రాళ్లు కేకలు వేస్తాయి” అన్నాడు.
41ఆయన యెరూషలేము పట్టణాన్ని సమీపించినప్పుడు దానిని చూసి దాని గురించి ఏడుస్తూ, 42“నీకు దేని ద్వార సమాధానం కలుగుతుందో నీవు తెలుసుకొని ఉంటే బాగుండేది, కాని ఇప్పుడది నీ కళ్ళ నుండి దాచబడి ఉంది. 43-44ప్రభువు నిన్ను దర్శించినప్పుడు నీవు గ్రహించుకోలేదు కనుక నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా ఒక గట్టు కట్టి అన్ని వైపుల నిన్ను ముట్టడి వేసి అన్ని వైపుల నుండి నిన్ను అరికట్టి, నీ గోడల లోపల ఉన్న నీ పిల్లలతో పాటు నిన్ను భూమిలోకి నలిపి నీలో ఒక రాయి మీద ఇంకొక రాయి నిలబడకుండ చేసే దినాలు వస్తాయి” అని చెప్పారు.
యెరూషలేము దేవాలయంలో యేసు
45యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి, అక్కడ అమ్ముకొనే వారిని తరమడం ప్రారంభించారు. 46“ ‘నా గృహం ప్రార్థన గృహము’#19:46 యెషయా 56:7 అని వ్రాయబడి ఉంది, కానీ మీరు దానిని ‘దొంగల గుహగా’#19:46 యిర్మీయా 7:11 చేశారు” అని అన్నారు.
47ఆయన ప్రతి రోజు దేవాలయంలో బోధిస్తూ ఉండేవారు. అయితే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ప్రజానాయకులు ఆయనను చంపాలని ప్రయత్నించారు. 48అయినా ప్రజలందరు ఆయన చెప్పే మాటలను వినాలని ఆయననే హత్తుకుని ఉన్నారు, కనుక వారేమి చేయలేకపోయారు.

Currently Selected:

లూకా 19: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in