మత్తయి సువార్త 6:25-34
మత్తయి సువార్త 6:25-34 TSA
“కాబట్టి నేను మీతో చెప్పేదేంటంటే, మీరు ఏమి తినాలి ఏమి త్రాగాలి? అని మీ ప్రాణం గురించి గాని లేదా ఏమి ధరించాలి అని మీ దేహం గురించి గాని చింతించకండి. ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి. గాలిలో ఎగిరే పక్షులను చూడండి; అవి విత్తనాలు నాటవు, కోత కోయవు, కొట్లలో కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నారు. మీరు వాటికన్నా ఇంకా ఎంతో విలువైన వారు కారా? మీలో ఒక్కరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట పొడిగించుకోగలరా? “మీరు బట్టల గురించి ఎందుకు చింతిస్తున్నారు? పొలంలో పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి. అవి కష్టపడవు బట్టలు నేయవు. అయినా గొప్ప వైభవం కలిగి ఉన్న సొలొమోను కూడా ఈ పూలలో ఒక దానిలా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను. అల్పవిశ్వాసులారా, ఈ రోజు ఉండి రేపు అగ్నిలో పడవేయబడే పొలంలోని గడ్డినే దేవుడు అంతగా అలంకరించినప్పుడు, ఆయన మిమ్మల్ని ఇంకెంత ఎక్కువగా అలంకరిస్తారు! కాబట్టి ‘ఏమి తినాలి? ఏమి త్రాగాలి? ఏమి ధరించుకోవాలి?’ అంటూ చింతించకండి. దేవుని ఎరుగని ప్రజలు అలాంటి వాటి వెంటపడతారు, కాని అవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకండి. అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి. రేపటి గురించి చింతించకండి; ఎందుకంటే రేపటి సంగతి గురించి రేపు చింతింస్తుంది; ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.