మార్కు సువార్త 1:1-11

మార్కు సువార్త 1:1-11 TSA

దేవుని కుమారుడైన క్రీస్తు యేసును గురించిన సువార్త ప్రారంభం. యెషయా ప్రవక్త ద్వారా వ్రాయబడినట్లుగా: “ఇదిగో, నీకు ముందుగా నా దూతను పంపుతాను, అతడు నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు.” “అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న ఒకరి స్వరం, ‘ప్రభువు కోసం మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన కోసం త్రోవలను సరాళం చేయండి’ ” అని చెప్తుంది. అలాగే బాప్తిస్మమిచ్చే యోహాను అరణ్యంలో ప్రత్యక్షమై, పాపక్షమాపణ కొరకై పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొందుకోండని ప్రకటిస్తున్నాడు. యూదయ గ్రామీణ ప్రాంతమంతా, యెరూషలేము ప్రజలందరూ అతని దగ్గరకు వచ్చి తమ పాపాలను ఒప్పుకుని యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందారు. యోహాను ఒంటె వెంట్రుకలతో చేయబడిన వస్త్రాలను ధరించి, నడుముకు తోలుదట్టీ కట్టుకునేవాడు. అతడు మిడతలు అడవి తేనె తినేవాడు. ఆయన ఇచ్చిన సందేశమిది: “నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు. నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను, కాని ఆయన మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తారు.” ఆ సమయంలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందారు. యేసు నీటిలో నుండి బయటకు వస్తుండగా, ఆకాశం చీలి దేవుని ఆత్మ పావురంలాగ ఆయన మీదికి దిగి రావడం అతడు చూశాడు. అంతేకాక పరలోకం నుండి ఒక స్వరం: “నీవు నా కుమారుడవు, నేను ప్రేమించేవాడవు; నీయందు నేను ఎంతో ఆనందిస్తున్నాను” అని చెప్పడం వినబడింది.