లూకా 15:11-24

లూకా 15:11-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యేసు ఇంకా మాట్లాడుతూ: “ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులున్నారు. వారిలో చిన్నవాడు తన తండ్రితో, ‘నాన్నా, ఆస్తిలో నాకు రావలసిన భాగం నాకు ఇవ్వు’ అని అడిగాడు. కాబట్టి తండ్రి తన ఆస్తిని వారిద్దరికి పంచి ఇచ్చాడు. “కొన్ని రోజుల్లోనే, ఆ చిన్నకుమారుడు తన దగ్గర ఉన్నదంతా పోగుచేసుకుని, సుదూర దేశానికి బయలుదేరాడు అక్కడ తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ తన సంపదను విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. అతడు అంతా ఖర్చు చేసిన సమయంలోనే, ఆ దేశంలో తీవ్రమైన కరువు రావడం వలన అతనికి ఇబ్బందులు మొదలయ్యాయి. కాబట్టి అతడు ఆ దేశస్థులలో ఒకని పొలంలో పందులను మేపే పనిలో చేరాడు. అతనికి బాగా ఆకలివేస్తూ ఉండింది, కాని తినడానికి ఎవరూ ఏమి ఇవ్వలేదు కాబట్టి అతడు పందులు మేస్తున్న పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూశాడు. “అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు, ‘నా తండ్రి దగ్గర పని చేసే చాలామంది కూలివారికి కూడా సమృద్ధిగా ఆహారం ఉంది, కానీ నేను ఇక్కడ ఆకలితో చస్తున్నాను. నేను నా తండ్రి దగ్గరకు వెళ్లి అతనితో, నాన్నా, నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. నీ కుమారుడనని అనిపించుకునే అర్హత కూడా నాకు లేదు, నన్ను నీ పనివారిలో ఒకనిగా పెట్టుకో అని చెప్తాను’ అనే ఆలోచనతో లేచి, అతని తండ్రి దగ్గరకు వెళ్లాడు. “వాడు ఇంకా దూరంగా ఉండగానే, వాని తండ్రి వాన్ని చూసి, వానిపై జాలిపడి, పరుగెత్తుకొని వచ్చి వాని కౌగిలించుకుని వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. “అప్పుడు వాడు తన తండ్రితో, ‘నాన్నా, నీకు పరలోకానికిని విరోధంగా నేను పాపం చేశాను. ఇప్పటినుండి నేను నీ కుమారుడను అని అనిపించుకోడానికి కూడా అర్హున్ని కాను’ అని అన్నాడు. “కాని వాని తండ్రి తన పనివారితో, ‘త్వరగా! విలువైన వస్త్రాలను తెచ్చి ఇతనికి ధరింపచేయండి, వీని చేతికి ఉంగరం పెట్టి, కాళ్లకు చెప్పులను తొడిగించండి. ఒక క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం విందు చేసుకుని ఆనందిద్దాము. ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, వీడు తప్పిపోయి దొరికాడు’ అని అన్నాడు. అలా వారందరు అతనితో ఆనందించడం మొదలుపెట్టారు.

షేర్ చేయి
చదువండి లూకా 15

లూకా 15:11-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో చిన్నవాడు ‘నాన్నా, ఆస్తిలో నా వాటా నాకు పంచి ఇవ్వు’ అన్నాడు. తండ్రి తన ఆస్తిని వారికి పంచి ఇచ్చాడు. కొద్ది రోజుల తరువాత చిన్న కొడుకు తనకున్నదంతా కూడగట్టుకుని దూర దేశానికి ప్రయాణమై వెళ్ళాడు. అక్కడ తన డబ్బంతా దుర్వ్యసనాలపై విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. అంతా ఖర్చయిపోయాక ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. అతనికి ఇబ్బందులు మొదలైనాయి. దాంతో అతడు వెళ్ళి ఆ దేశంలో ఒక వ్యక్తి దగ్గర పనికి కుదిరాడు. ఆ వ్యక్తి అతనిని తన పందులు మేపడానికి తన పొలాల్లోకి పంపించాడు. అతడు ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశ పడ్డాడు. కానీ అతనికి ఎవరూ ఏమీ ఇవ్వలేదు. అతనికి బుద్ధి వచ్చింది. అతడిలా అనుకున్నాడు, ‘నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళకు ఆహారం పుష్కలంగా ఉంది. నేనేమో ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. నాన్నా, నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను. ఇక నుండి నీ కొడుకు అనిపించుకోవడానికి నాకు ఏ అర్హతా లేదు. నన్ను నీ కూలీల్లో ఒకడిగా పెట్టుకో అని చెబుతాను.’ ఇలా అనుకుని అతడు లేచి తన తండ్రి దగ్గరికి వచ్చాడు. అతడింకా దూరంగా ఉండగానే తండ్రి అతణ్ణి చూసి కనికరపడి, పరుగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కొడుకు తండ్రితో, ‘నాన్నా, నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను. ఇక నుండి నీ కొడుకునని చెప్పుకోడానికి నాకు ఏ యోగ్యతా లేదు’ అన్నాడు. “అయితే తండ్రి తన సేవకులతో, “శ్రేష్ఠమైన బట్టలు తెచ్చి ఇతనికి తొడగండి. ఇతని చేతికి ఉంగరం పెట్టి, కాళ్ళకు చెప్పులు తొడగండి. కొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం తిని సంబరాలు చేసుకుందాం. నా ఈ కొడుకు చనిపోయి మళ్ళీ బతికాడు. తప్పిపోయి దొరికాడు’ అని చెప్పాడు. అప్పుడు వారంతా సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు.

షేర్ చేయి
చదువండి లూకా 15

లూకా 15:11-24 పవిత్ర బైబిల్ (TERV)

యేసు ఇంకా ఇలా చెబుతూ పోయాడు: “ఒకనికి యిద్దరు కుమారులు ఉన్నారు. చిన్నవాడు తండ్రితో, ‘నాన్నా! నా భాగం ఆస్తి నాకు ఇచ్చేయి’ అని అడిగాడు. తండ్రి సరేనని తన ఆస్తిని ఇరువురి మధ్య పంచిపెట్టాడు. “కొద్ది రోజుల్లో చిన్నవాడు తనపాలు భాగం తీసుకొని దూర దేశాలకు వెళ్ళి పొయ్యాడు. ఉన్న డబ్బంతా విలాసాలకు ఖర్చు పెట్టాడు. అంతా ఖర్చయి పోయింది. ఇంతలో అతడున్న దేశంలో తీవ్రమైన క్షామం వచ్చింది. అతని దగ్గర ఏమీ మిగల్లేదు. కనుక ఆ దేశంలో ఉన్న ఒక ఆసామి దగ్గర ఉద్యోగంలో చేరాడు. ఆ ఆసామి అతణ్ణి పందులు కాయటానికి నియమించాడు. ఆ పందులు తీనే ఆహారంతో తన కడుపు నింపుకోవాలని అనుకున్నాడు. ఆయినా ఎవ్వరూ అతనికి ఏదీ ఇవ్వలేదు. “అతనికి బుద్ధి వచ్చింది. అతడు ‘నా తండ్రి పనివాళ్ళ దగ్గర కూడా కావలసినంత తిండి ఉంది. నేనేమో ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను ఈ గ్రామం వదిలి తిరిగి తండ్రి దగ్గరకు వెళ్తాను. వెళ్లి అతనితో నాన్నా! నేను దేవుని పట్ల, నీ పట్ల కూడా పాపం చేశాను. నేను నీ కుమారుడనని చెప్పుకొంటానికి కూడా తగను. నన్ను కూడా నీ దగ్గర పని చేసేవాళ్ళతో ఉండనీ!’ అని చెప్పాలని మనస్సులో అనుకున్నాడు. వెంటనే అతడు తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. “ఇంటికి కొంత దూరంలో ఉండగానే అతని తండ్రికి తనకుమారుణ్ణి చూసి చాలా కనికరం కలిగింది. అతడు పరుగెత్తుకొంటూ తన కుమారుని దగ్గరకు వెళ్ళి అతణ్ణి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు. అతడు తండ్రితో, ‘నాన్నా! నేను దేవుని పట్ల, నీ పట్ల పాపం చేసాను. నేను నీ కుమారుణ్ణని చెప్పుకోవటానికి కూడా తగను’ అని అన్నాడు. “అతని తండ్రి పని వాళ్ళతో, ‘వెంటనే వెళ్ళి మంచి దుస్తులు, వేలికి ఉంగరము, కాళ్లకు జోళ్ళు తెచ్చి యితనికి తొడిగించండి. బాగా బలిసిన దూడను తీసుకు వచ్చి కొయ్యండి. పండుగ చేసుకొందాం. చనిపోయిన నా కుమారుడు బ్రతికి వచ్చాడు. తప్పి పోయినవాడు తిరిగి దొరికాడు’ అని అన్నాడు. వాళ్ళు వెంటనే పండుగ చేసుకోవడం మొదలు పెట్టారు.

షేర్ చేయి
చదువండి లూకా 15

లూకా 15:11-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు ఆయన ఇట్లనెను–ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు–తండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్నిదినములైన తరు వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడసాగి, వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు–నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను. నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి –ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి; క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము; ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి.

షేర్ చేయి
చదువండి లూకా 15

లూకా 15:11-24 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

యేసు ఇంకా మాట్లాడుతూ: “ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులున్నారు. వారిలో చిన్నవాడు తన తండ్రితో, ‘నాన్నా, ఆస్తిలో నాకు రావలసిన భాగం నాకు ఇవ్వు’ అని అడిగాడు. కాబట్టి తండ్రి తన ఆస్తిని వారిద్దరికి పంచి ఇచ్చాడు. “కొన్ని రోజుల్లోనే, ఆ చిన్నకుమారుడు తన దగ్గర ఉన్నదంతా పోగుచేసుకుని, సుదూర దేశానికి బయలుదేరాడు అక్కడ తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ తన సంపదను విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. అతడు అంతా ఖర్చు చేసిన సమయంలోనే, ఆ దేశంలో తీవ్రమైన కరువు రావడం వలన అతనికి ఇబ్బందులు మొదలయ్యాయి. కాబట్టి అతడు ఆ దేశస్థులలో ఒకని పొలంలో పందులను మేపే పనిలో చేరాడు. అతనికి బాగా ఆకలివేస్తూ ఉండింది, కాని తినడానికి ఎవరూ ఏమి ఇవ్వలేదు కాబట్టి అతడు పందులు మేస్తున్న పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూశాడు. “అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు, ‘నా తండ్రి దగ్గర పని చేసే చాలామంది కూలివారికి కూడా సమృద్ధిగా ఆహారం ఉంది, కానీ నేను ఇక్కడ ఆకలితో చస్తున్నాను. నేను నా తండ్రి దగ్గరకు వెళ్లి అతనితో, నాన్నా, నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. నీ కుమారుడనని అనిపించుకునే అర్హత కూడా నాకు లేదు, నన్ను నీ పనివారిలో ఒకనిగా పెట్టుకో అని చెప్తాను’ అనే ఆలోచనతో లేచి, అతని తండ్రి దగ్గరకు వెళ్లాడు. “వాడు ఇంకా దూరంగా ఉండగానే, వాని తండ్రి వాన్ని చూసి, వానిపై జాలిపడి, పరుగెత్తుకొని వచ్చి వాని కౌగిలించుకుని వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. “అప్పుడు వాడు తన తండ్రితో, ‘నాన్నా, నీకు పరలోకానికిని విరోధంగా నేను పాపం చేశాను. ఇప్పటినుండి నేను నీ కుమారుడను అని అనిపించుకోడానికి కూడా అర్హున్ని కాను’ అని అన్నాడు. “కాని వాని తండ్రి తన పనివారితో, ‘త్వరగా! విలువైన వస్త్రాలను తెచ్చి ఇతనికి ధరింపచేయండి, వీని చేతికి ఉంగరం పెట్టి, కాళ్లకు చెప్పులను తొడిగించండి. ఒక క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం విందు చేసుకుని ఆనందిద్దాము. ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, వీడు తప్పిపోయి దొరికాడు’ అని అన్నాడు. అలా వారందరు అతనితో ఆనందించడం మొదలుపెట్టారు.

షేర్ చేయి
చదువండి లూకా 15